కేఆర్ పురం ఐటిడిఏలో ప్రకృతి వ్యవసాయంపై సమీక్ష సమావేశం

ఏలూరు/ బుట్టాయిగూడెం : ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని కేఆర్ పురం ఐటిడిఏ భవనంలో ఈరోజు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాబురావు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ మరియు సిబ్బంది హాజరయ్యారు.
సమావేశంలో ముందుగా సిబ్బందితో పరిచయ కార్యక్రమం నిర్వహించి, ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతపై బాబురావు నాయుడు విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న కార్యకలాపాలను సమీక్షించి, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతాలలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసే మార్గాలపై క్షుణ్ణంగా చర్చించారు.
ఈ సందర్భంగా కొయ్యలగూడెం మండలం సీతంపేట గ్రామంలో ఫీల్డ్ విజిట్ నిర్వహించి, అక్కడ అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. అనంతరం బైనగూడెం గ్రామంలో సుంకర సత్తిరాజు గారి ఎన్పీఎం షాప్ను సందర్శించి, అందుబాటులో ఉన్న ఇన్పుట్స్పై వివరాలు తెలుసుకున్నారు. అలాగే చీమలవారి గూడెంలో ఏటీఎం (Any Time Money) మోడల్ను పరిశీలించారు. అనంతరం కేడర్ సభ్యులతో సమావేశమై, వివిధ మోడళ్లను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. బీడీ భూములు మరియు పోడు వ్యవసాయంలో ప్రకృతి పద్ధతులు అనుసరించాలి, అలాగే భూమిని 365 రోజులు పంటలతో లేదా మల్చింగ్తో కప్పి ఉంచాలని సూచించారు. అంతేకాకుండా, రైతులకు ప్రాక్టికల్ అవగాహన కల్పించేందుకు సీడ్ బాల్స్, బ్రహ్మాస్త్రం, ఘన జీవామృతం వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై డెమోలను నిర్వహించారు. ఏలూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకువెళతామని DPM వెంకటేష్ తెలియచేశారు.



