కోహ్లీ ఎప్పటికీ ఆర్సీబీని వీడడు: మో బోబాట్

ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. గత సీజన్లో 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో టోర్నీ ఆరంభం నాటి నుంచి నేటి వరకు జట్టును వీడకుండా ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ గురించి ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ స్పందించాడు. ఆర్సీబీ నిర్వహించిన పాడ్కాస్ట్లో మాట్లాడాడు. ‘విరాట్ కోహ్లీ కచ్చితంగా ఆర్సీబీకి ఐకానిక్ హీరోగా ఉంటాడు. అతడు మరో జట్టుకు వెళతాడని నేను అనుకోవడం లేదు. అడి ట్రాక్ రికార్డ్ అత్యద్భుతం. 18 సంవత్సరాలుగా ఒకే జట్టులో ఉన్నాడు. ఐపీఎల్లో దాదాపు 9,000 పరుగులకు చేరువలో ఉన్నాడు. సగటున విరాట్ సీజన్కు 500 రన్స్ చేస్తున్నాడు. అతడొక అద్భుతం. ఐపీఎల్ 2025లో విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. అయితే ఐపీఎల్ 2026లో మాత్రం మేం డిఫెండింగ్ ఛాంపియన్స్ కాదు. మేం ఏమీ డిఫెండ్ చేసుకోవడం లేదు. మేము ప్రస్తుత ఛాంపియన్స్. డిఫెండింగ్ చేసుకునే మైండ్ సెట్ మాకొద్దు. మాకు ఎటాకింగ్ అంటేనే ఇష్టం. బ్యాక్ టూ బ్యాక్ విజయాల కోసం చూస్తున్నాం’ అని మో బోబాట్ వెల్లడించాడు.