నేరస్థులకు శిక్షే లక్ష్యం,, బాధితులకు న్యాయమే ధ్యేయం…. జిల్లా ఏస్పీ

మదనపల్లి జిల్లా : మదనపల్లి: బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చడంలో కోర్టు కానిస్టేబుళ్లు వారధిలా పనిచేయాలని, సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి నిందితులకు శిక్ష పడేలా చూడటమే ప్రథమ కర్తవ్యమని మదనపల్లి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ స్పష్టం చేశారు. నేడు మంగళవారం మదనపల్లిలోని జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో డీసీఆర్బీ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ సిబ్బందితో ఎస్పీ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….. క్షేత్రస్థాయిలో పనిచేసే కోర్టు కానిస్టేబుళ్లు ప్రతి కేసుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా హత్యలు, మహిళలు మరియు చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాలు (పోక్సో), మత్తు పదార్థాల రవాణా (ఎన్.డి.పి.ఎస్) వంటి తీవ్రమైన కేసుల్లో నిందితులకు కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడేలా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. “నిందితుడికి శిక్ష పడినప్పుడే బాధితుడికి నిజమైన న్యాయం జరిగినట్లు” అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కోర్టు విచారణ సమయంలో సాక్షులు భయం లేకుండా వాంగ్మూలం ఇచ్చేలా వారికి రక్షణ కల్పించి, విచారణ సమయానికి వారిని తప్పనిసరిగా కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. న్యాయస్థానాలు జారీ చేసే సమన్లు, బెయిలబుల్ మరియు నాన్-బెయిలబుల్ వారెంట్లు అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న వారెంట్లను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి, ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. దేశంలో నూతనంగా అమల్లోకి వచ్చిన బి.ఎన్.ఎస్.ఎస్ చట్టాల పట్ల ప్రతి కానిస్టేబుల్ పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కొత్త నిబంధనల ప్రకారం కోర్టు ప్రొసీడింగ్స్ జరిగేలా చూడాలని సూచించారు. కోర్టులలో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన అనంతరం సంబంధిత కేసులలో సీసీ నంబర్లను తీసుకునేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని, కేసు వివరాలను విధిగా సీసీటీఎన్ఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ అప్లికేషన్ వినియోగంపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కోర్టు కానిస్టేబుళ్లు తమ పరిధిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో నిరంతరం వృత్తిపరమైన సత్సంబంధాలు కొనసాగిస్తూ, కేసుల పురోగతిని పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. విధుల పట్ల నిబద్ధతతో పనిచేసే సిబ్బందికి తగిన గుర్తింపు ఉంటుందని, విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో…. జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఏ. ఆదినారాయణ రెడ్డి, సీఎంఎస్ ఇన్స్పెక్టర్ కె. దస్తగిరి, పలువురు ఎస్ఐ లు, కోర్టు లైజనింగ్ అధికారులు మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.



