సమానత్వం సేవే లక్ష్యం – ఏపీజీబీ ఓబీసీ వెల్ఫేర్ జిల్లా కార్యదర్శి శ్రీ శాంతి

మైలవరం మార్చి 10 పల్లెవాణి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (APGB) ఓబీసీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయ్ పూలె వర్ధంతి సందర్బంగా మైలవరం పట్టణంలోని ఓబీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు ఆటవస్తువుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఏపీజీబీ ఓబీసీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ కడప జిల్లా కార్యదర్శి శ్రీ శాంతి, ఏపీజీబీ మైలవరం బ్రాంచ్ మేనేజర్ వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డి. మహమ్మద్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినులకు ఆటవస్తువులు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ శాంతి మాట్లాడుతూ సావిత్రిభాయ్ పూలె గారు మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యతలను నిర్మూలించి సమసమాజ స్థాపన కోసం ఆమె చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. దళితులు మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె పోరాడి సమానత్వానికి మార్గం చూపారని తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం వితంతువులకు ఆశ్రయ గృహాలు ఏర్పాటు చేయడం, బాల్య వివాహాలను వ్యతిరేకించడం, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం వంటి సంస్కరణలు ఆమె గొప్ప సేవలని వివరించారు.
ఏపీజీబీ మైలవరం బ్రాంచ్ మేనేజర్ వెంకటరమణ మాట్లాడుతూ, విద్యార్థినులు చదువుతో పాటు మంచి విలువలను అలవరచుకొని భవిష్యత్తులో సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డి. మహమ్మద్ మాట్లాడుతూ, విద్యార్థినుల విద్యాభివృద్ధి కోసం తన వంతుగా రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ బాలికల వసతి గృహం వార్డెన్ ఆర్ సుజాత దేవి,సిబ్బంది కృష్ణయ్య, హిమాంబి, సుమారుగా 200మంది విద్యార్థినులు పాల్గొన్నారు విద్యార్థినుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని అసోసియేషన్ నాయకులు తెలిపారు.



