
పల్లె వాణి డోర్నకల్ ఆగస్టు 7: భర్తను హత్య చేయాలని ప్రియుడిని కోరుతూ భార్య పంపినట్లు చెబుతున్న వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సందేశాలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో వెలుగుచూసింది.
చిలుకోడుకు చెందిన గాదే రాజేశ్వరరావుకు 2016లో సూర్యాపేట జిల్లాకు చెందిన భవానితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తన భార్య భవానికి సైదులు అనే కొరియర్ బాయ్తో వివాహేతర సంబంధం ఉన్నట్లు రాజేశ్వరరావు ఆరోపించారు.ఈ విషయం గత నెల 27న తనకు తెలియడంతో రాజేశ్వరరావు పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం తన అన్నను తీసుకురావడానికి వెళ్తున్న సమయంలో సైదులు తనను వెంబడించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని నుంచి తప్పించుకుని ఇంటికి తిరిగి వచ్చిన రాజేశ్వరరావు.. తన భార్య ఫోన్ను పరిశీలించినట్లు తెలిపారు.అందులో తనను ఎలాగైనా చంపాలని, లేదంటే తాను చనిపోతానని భవాని సైదులుకు పంపినట్లు చెబుతున్న సందేశాలను గుర్తించినట్లు రాజేశ్వరరావు పేర్కొన్నారు. దీంతో ఆ చాటింగ్కు సంబంధించిన స్క్రీన్షాట్లను సేకరించి, తన భార్య భవాని, సైదులుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుదారు గత పదేళ్లుగా ఖమ్మంలో నివసిస్తున్నారని, ఈ వ్యవహారానికి సంబంధించిన ఘటనలన్నీ ఖమ్మం పరిధిలోనే జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో డోర్నకల్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం కేసును సంబంధిత పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.



