రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

జమ్మలమడుగు టౌన్ పల్లెవాణి న్యూస్ : రాష్ట్రంలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జమ్మలమడుగు ఆర్డిఓ సభా భవనంలో2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 35150 మంది గాను 24 కోట్ల రూపాయల చెక్కును వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిన రైతు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇటువంటి నిరంతర పెట్టుబడి సహాయ పథకాలు ఎంతో దోహదపడతాయని వారు తెలిపారు.ఈ ఏడాది తొలి విడత కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి భారీ ఆర్థిక ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా అందించే రూ. 5,000 మరియు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద అందించే రూ. 2,000 కలిపి.. మొత్తం రూ. 7,000 లను లబ్ధిదారులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్’ పద్ధతిలో నేరుగా జమ చేయడం జరిగిందని నేతలు వెల్లడించారు.అన్నదాతల అభ్యున్నతి, వారి ముఖాల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సాగునీటి సరఫరా నుండి మద్దతు ధర కల్పన వరకు రైతాంగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లికార్జున, టిడిపి రాష్ట్ర కార్యదర్శి బిర్రు గుర్రప్ప ,రైతులు పాల్గొన్నారు.



