ఎండ తీవ్రతపై ముందస్తు జాగ్రత్త చర్యలపై అధికారులతో కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమీక్ష

ఏలూరు, ఏప్రిల్, 1: ప్రస్తుత వేసవిలో ఎల్నినో ప్రభావం కారణంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఎండ తీవ్రతకు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం ఎల్నినో ప్రభావం కారణంగా ఎండ తీవ్రతపై తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలు, ప్రజలను అప్రమత్తం చేయడం తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో అధిక వేసవిలో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నందున, అత్యవసరమైతే తప్ప ఎండలో ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్దులు,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బయట తిరగడం నివారించాలన్నారు. ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు అవగాహన కలిగించాలని, చలివేంద్రాలు ఎక్కువగా ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వడదెబ్బ తగిలిన వారికి తక్షణమే చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటిలోనూ అవసరమైన మేర ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు సిద్ధం చేయాలన్నారు. వేడి గాలులు వీసీ సమయంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు నుండి వెళ్లే సమయంలో బయట తిరగకుండా పిల్లలు నేరుగా ఇంటికి వెళ్లేలా చూడాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు త్రాగునీరు, నీడలాగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ బస్సు స్టాండ్లు, బస్సు షెల్టర్లలో త్రాగునీరు, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అగ్నిమాపక శాఖ, రెవిన్యూ, తదితర శాఖల వారు ఫైర్ క్రాకర్స్ వంటి వాటికి జారీ చేసే లైసెన్స్ లు షాపులను పరిశీలించాలన్నారు. ఎండా తీవ్రత కారణంగా దెబ్బతినే పంటలు గురించి, వాటిని పరిరక్షించుకునే విధానాలు గురించి రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ చేసే పోలీసు సిబ్బందికి ఎండ తీవ్రతకు గురికాకుండా అవసరమైన కూల్ జాకెట్స్ అందించాలన్నారు. ఎండా తీవ్రతపై ప్రజలను ఆందోళన కలిగించే రీతిలో సామజిక మాధ్యమాలలో సమాచారాన్ని వ్యాప్తి జరగకుండా చూడాలన్నారు. పాఠశాలలోని వాటర్ ట్యాంకులు,, ఓ హెచ్ ఆర్ ఎస్ లలో త్రాగునీటి నాణ్యతను పరిశీలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేసవిలో త్రాగునీటి ఎటువంటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేసవిలో విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, డిఆర్ఓ భాస్కర్, డిపిఓ అనురాధ, జిల్లా పరిషత్ సీఈఓ భీమేశ్వరరావు, డిసిహెచ్ ఎస్ డా.పాల్ సతీష్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఐసిసిఎస్ పీడీ సరదా,, ట్రాన్స్కో ఎస్ఈ సాల్మన్ రాజు,, వ్యవసాయాధికారి హబీబ్ భాసా, ఉద్యానవనాలు శాఖాధికారి సాజా నాయక్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ త్రినాధ్ బాబు, పశుసంవర్ధనక శాఖాధికారి గోవిందరాజులు, ఆర్టీసీ ఆర్ ఎం షబ్నమ్, ప్రభృతులు పాల్గొన్నారు.



