తిరుపతి లో పలు పోలీసుల కార్యాలయలను శంకుస్థాపన చేసిన… ఏపీ,డిజిపి

తిరుపతి జిల్లా, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్. శాంతి భద్రతల విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మధుసూదన్ రెడ్డి, ఐపీఎస్. నేడు శుక్రవారం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో పోలీస్ సంక్షేమానికి సంబంధించిన పలు మౌలిక వసతుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్, ప్రధాన ప్రవేశ ద్వారం (గ్రౌండ్ గేట్), కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సతీమణి కూడా పాల్గొన్నారు.
అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీజీపీ , అదనపు డీజీపీతో కలిసి జిల్లా పోలీసింగ్, శాంతిభద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రత, పోలీస్ సంక్షేమం తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, జిల్లాలో అమలవుతున్న పరిపాలనా చర్యలు, పోలీసింగ్ విధానాలు, శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీలు, డీఎస్పీలు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
సమీక్ష సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, ప్రజలకు అందిస్తున్న పోలీస్ సేవలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జరుగుతున్న పర్యవేక్షణ, సీసీ కెమెరాల వినియోగం, పటిష్ట నైట్ బీట్ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై డీజీపి క్షుణ్ణంగా సమీక్షించారు. ప్రజా భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, జిల్లాలో డ్రోన్ సాంకేతికతను నేర నియంత్రణ, జనసమ్మర్థ నిర్వహణ, ప్రత్యేక ఆపరేషన్లలో సమర్థవంతంగా వినియోగిస్తున్న విధానాన్ని వివరించారు. అదేవిధంగా మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ప్రతి సబ్ డివిజన్ పరిధిలో సర్కిల్ వారీగా నిరంతర డ్రగ్స్, గంజాయి నిరోధక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, డ్రగ్ టెస్టింగ్ నిర్వహిస్తూ యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఇటీవల జిల్లా కలెక్టర్తో కలిసి నిర్వహించిన రహదారి భద్రత బస్సు యాత్ర, ప్రమాదాలకు గురయ్యే (బ్లాక్ స్పాట్స్) ప్రాంతాల గుర్తింపు, ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాల వివరాలను డీజీపీకి వివరించారు.
మహిళల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, శక్తి టీమ్ ద్వారా మహిళలకు తక్షణ స్పందన, అవగాహన కార్యక్రమాలు, భద్రతా చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయని వివరించారు.
సైబర్ నేరాల నియంత్రణలో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన సైబర్ & సోషల్ మీడియా మానిటరింగ్ వ్యవస్థ చురుకుగా పనిచేస్తోందని డీజీపీ ప్రశంసించారు. అలాగే యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా నిరంతర డ్రగ్ టెస్టింగ్, ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని సన్మార్గంలో నడిపించే దిశగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను అభినందించారు.
జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్, పోలీస్ సంక్షేమం, ప్రజా సేవల మెరుగుదల దిశగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను డీజీపీ అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.



