రబీ (దాళ్వా) సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి

ఏలూరు, మార్చి11, జిల్లా కలెక్టరేటు జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబర్లో బుధవారం రబీ (దాళ్వా) సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ అధ్యక్షతన సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాలు ద్వారా ధాన్యం కొనుగోళ్లపై గ్రామస్థాయిలో రైతులందరికీ అవగాహన సదస్సు ద్వారా పూర్తి అవగాహన కల్పించి, ప్రతి రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి అమ్ముకునేలా చూడాలని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సులభతరం అయిందని 7337359375 ఫోను నెంబరు ద్వారా వాట్సప్ గవర్నెన్స్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టరేటులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఫోను నెంబరు 7702003584, టోల్ ఫ్రీ నెంబరు 18004256453 రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కనీస మద్దతు ఏ గ్రేడు ఒక క్వింటాలు రూ 2,389/-లు, 75 కేజీలు రూ 1,792/-లు, 40 కేజీలు రూ 956 లు, సాధారణ రకం ఒక క్వింటాలు రూ 2,369/-లు, 75 కేజీలు రూ 1,777/-లు, 40 కేజీలు రూ 948/- లు మద్దతు ధర కల్పించడం జరిగిందని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు లోబడి ధాన్యం బాగా ఆరబెట్టి శుద్ధి చేసుకుని రైతు సేవా కేంద్రములకు తీసుకువచ్చే విధంగా సంబంధిత శాఖలు అధికారులు రైతులందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 1,00,189 ఎకరాలలో వరిపంట ఉండగా, 3,57,907 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా ఉందని, ధాన్యం కొనుగోలు టార్గెటును నిర్ణయించవలసి ఉందని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ రైతు ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధర కన్నా తక్కువ రేటుకి అమ్ము కోకూడదని స్పష్టం చేశారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో తగినంత సిబ్బందిని నియమించి వారికి పూర్తిస్థాయిలో శిక్షణను అందించాలని, ధాన్యం కొనుగోలులో ఎటువంటి సమస్యలు లేకుoడా రైతులకు మంచిసేవలు అందించాలని ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల్లో ఉండవలసిన పరికరాలు సిద్ధంగా ఉండేలా చూసుకోవడంతో పాటు రైతు సేవా కేంద్రానికి సంబంధించిన నాణ్యమైన గోనె సంచులు, హమాలీలు, రవాణాకు సంబంధించిన వాహనాలు, అందుబాటులో ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు కావలసిన తగినన్ని ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాస్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆయా గ్రామాలు పరిధిలో ధాన్యం దిగుబడిని అంచనాకు అనుగుణంగా మండల, గ్రామ స్థాయిలో ఉన్న సిబ్బందితో ప్రణాళికలను సిద్ధం చేసుకుని ధాన్యం కొనుగోలుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తూకం యంత్రాలు, తేమ కొలిచే పరికరాలు, క్వాలిటీ గన్ని సంచులు తదితర అవసరమైన సామగ్రి సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. అలాగే ధాన్యం నిల్వలు, రవాణా వాహనాలకు జిపిఎస్ సిస్టం ఉండేలా చూడాలని ఆదేశించారు. చెల్లింపులు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చెయ్యాలని, ఎక్కడ ఒక చిన్న ఫిర్యాదు రాకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో వివరాలు, విధానాలు, గిట్టుబాటు ధరలు, పూర్తి సమాచారాన్ని రైతులకు అర్థమయ్యే విధంగా రైతు సేవా కేంద్రాలలో డిస్ ప్లే చెయ్యాలని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత ఉండేలా పర్యవేక్షణ చెయ్యాలని, రైతు సేవా కేంద్రాలకు వచ్చిన రైతులతో స్నేహభావంతో మెలిగి, లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజరు పి.శివరామ మూర్తి, జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాష, జిల్లా డియస్ వో ఇ.బి. విలియమ్స్, జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారి యస్.బి. శేఖరు, డిసివో అరిమిల్లి శ్రీనివాసు, జిల్లా మార్కెటింగు అధికారి యం.డి.వి. శ్రీనివాస రావు, శాస్త్రవేత్త యం.గిరిజారాణి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



