బధిర బాలికలకు కుట్టు మిషన్లు విరాళం – కుట్టు మిషన్లు అందజేసిన ఐఎంఏ మహిళా విభాగం

నంద్యాల పల్లెవాణి: అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న నవజీవన్ బధిరుల పాఠశాల బాలికలకు కుట్టు నైపుణ్య శిక్షణ కోసం రెండు కుట్టు మిషన్లు విరాళంగా అందజేశారు. నంద్యాల మహిళా వైద్య విభాగం గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ నర్మద, అధ్యక్షురాలు డాక్టర్ మాధవిల సహకారంతో ఈ కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ రవికష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ నంద్యాల మహిళా వైద్యులు ఆసుపత్రులలో వైద్య సేవలు అందించడంతోపాటు సామాజిక బాధ్యతలో భాగంగా విస్తృతత సేవా కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. డాక్టర్ మాధవి, డాక్టర్ నర్మద మాట్లాడుతూ దివ్యాంగ బాలికలు వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు ఉన్నత చదువులు కొనసాగించడం అవసరం అన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందించే సహకారం వినియోగించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నవజీవన్ బధిరుల పాఠశాల బాల బాలికలు, పాఠశాల నిర్వాహకులు భాస్కర్,రాజశేఖర్, సిస్టర్ జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.



