మరణం లోని వీడిపోని స్నేహం, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి.

పల్లె వాణి మరిపెడ, మార్చి 12:మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరిపెడ మండలం లచ్య తండా పరిధిలోని ఎన్హెచ్–365 జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరణంలో కూడా వీడని వీరి స్నేహం స్థానికులను కలిచివేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయ్ కిరణ్(21) మరియు భిక్షం(22) అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్ నుంచి మరిపెడ వైపు ప్రయాణిస్తున్నారు. చిన్ననాటి నుంచే కలిసి పెరిగిన వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా స్థానికులకు సుపరిచితులు. ఈ క్రమంలో మార్గమధ్యంలో గుర్తుతెలియని వేగవంతమైన వాహనం వారి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది.ప్రమాదం అనంతరం మృతదేహాలను పరిశీలించిన సమయంలో ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని ఉన్న దృశ్యాలు కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. మరణంలో కూడా వీడని వీరి స్నేహం అక్కడున్న వారిని కలచివేసింది.సమాచారం అందుకున్న వెంటనే మరిపెడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.



