ఏపి, సీఎం మరియు డిప్యుటీ సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు…. జిల్లా ఏస్పీ

తిరుపతి జిల్లా: తిరుపతి ప్రధాన పోలీస్ కార్యాలయం లో నేడు ఆదివారం జిల్లా ఏస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్, పోలీస్ సమావేశం లో మాట్లాడుతు….. జూలై 02 తేది న రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లి సమీపంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరియు ఉపముఖ్యమంత్రి కొనేదల పవన్ కళ్యాణ్, మరియు కేంద్ర మంత్రులు పాల్గొననున్న బహిరంగ సభ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన ప్రతి అంశాన్ని సూక్ష్మస్థాయిలో సమీక్షిస్తూ, వీవీఐపీ పర్యటన దృష్ట్యా ఎటువంటి భద్రతా లోపాలకు తావులేకుండా సెక్యూరిటీ సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అదే సమయంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతూనే సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సభా ప్రాంగణం, వీఐపీ రాకపోకల మార్గాలు, హెలిప్యాడ్, వేదిక పరిసరాలు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రజల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపులు, బందోబస్తు పాయింట్లు, అత్యవసర స్పందన వ్యవస్థలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.
కార్యక్రమానికి ముందు మరియు కార్యక్రమం ముగిసే వరకు సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, వీఐపీ మార్గాలలో యాంటీ సాబోటాజ్ తనిఖీలు నిరంతరాయంగా నిర్వహించాలని, బాంబు నిర్వీర్య దళం (బీడీస్), డాగ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బృందాలు, సీసీటీవీ పర్యవేక్షణ, డ్రోన్ నిఘా, కమ్యూనికేషన్ నెట్వర్క్ను పూర్తి స్థాయిలో వినియోగించి బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా ప్రతి అధికారి తనకు కేటాయించిన బాధ్యతను సంపూర్ణ బాధ్యతాయుతంగా నిర్వహించాలని, అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, ప్రజల రాకపోకలు, అత్యవసర సేవల నిర్వహణలో సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన కార్యాచరణను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసులు (పరిపాలన), రవి మనోహర్ ఆచారి (శాంతిభద్రతలు), శ్రీలత (మహిళా పోలీస్ స్టేషన్), శ్రీనివాస్ రావు (సాయుధ దళం), ఎస్బీ డీఎస్పీ గీతా కుమారి, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.



