మహబూబాబాద్ జిల్లాలో నేరాల అదుపుకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ.

పల్లె వాణి మహబూబాబాద్లో జిల్లా మే 23:మహబూబాబాద్ జిల్లాలో నేరాల అదుపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ శబరిష్ అన్నారు. పోలీసు స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజా భద్రత అంశాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సహా ఇతర మాదక ద్రవ్యాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగంపై కఠిన నిఘా కొనసాగించాలని సూచించారు. హోటళ్లు, లాడ్జ్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో తరచూ తనిఖీలు నిర్వహించి అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు.
అలాగే రైతులను మోసం చేస్తున్న నకిలీ విత్తనాలు (స్పూరియస్ సీడ్స్), నకిలీ ఎరువుల విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తనిఖీలు నిర్వహించి రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాత్రి వేళల్లో పటిష్టమైన నైట్ పట్రోలింగ్ నిర్వహించాలని, ప్రతి పట్రోలింగ్ అధికారి పాయింట్ బుక్స్ను సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు.
పెండింగ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్న ఎస్పీ, కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నేరస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. మత సామరస్యాన్ని కాపాడే విధంగా అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చెందకుండా కఠిన నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రజలు అసత్య సమాచారాన్ని నమ్మకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం కల్పించాలని ఎస్పీ తెలిపారు. విధినిర్వహణలో ప్రతిభ చూపిన వారికి ఎస్పీ ప్రశంస పత్రాలను అందజేశారు. డీఎస్పీ తిరుపతిరావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



